Home Blog Page 9

బావాబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరిందా ?

బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హారీష్ రావు కేంద్రంగా గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలకు పుల్ స్టాప్ పడిందా..బావబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరిందా? కేటీఆర్ తో భేటీ తర్వాత హారీష్ రావు గుంభనంగా ఉంటున్నారు తప్పితే పార్టీలో చోటు చేసుకుంటున్న సంఘటనలపై మౌనం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ మధ్య ఏదో రాజీ కుదిరిందనే మాట వినిపిస్తుంది.

బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను మొదట హారీష్ రావుకు కేసీఆర్ అప్పగించారు. తర్వాత పార్టీలో, కుటుంబంలో ఏమి జరిగిందో తెలియదు కానీ కేటీఆర్ రంగం ప్రవేశం చేశారు. కర్త, కర్మ, క్రియ అన్ని తానై బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఒక రకంగా కేసీఆర్ కు వారసుడిగా తనకు తాను ప్రమోట్ చేసుకోవడానికి కేసీఆర్ ఆ సభను వినియోగించుకున్నారు.

ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి, ట్రాబుల్ షూటర్ గా పేరు తెచ్చుకొని తనకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో హారీశ్ నొచ్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకోసమే పాదయాత్రగా సభగా వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకొని కారులోనే సభకు హాజరయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణమాలను బట్టి బావబామ్మర్ధులు కేటీఆర్-హారీష్ రావు గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వచ్చాయి.

తెలంగాణభవన్‌లో మే 13న నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమని హారీశ్ రావు ప్రకటించిన తర్వాత కూడా మే 16, 17 తేదీల్లో కేటీఆర్..హారీశ్ రావు నివాసానికి వరుసగా రెండు రోజులపాటు వెళ్లి గంటగంటలు చర్చలు జరపడంతోనే బావబామ్మర్ధుల మద్య పైకి కనిపించినంతా సఖ్యత లేదనే వాదనకు బలం చేకూరింది. అయితే ఈ చర్చల తర్వాత పార్టీ బలోపేతంపై చర్చించినట్లు మీడియా ముఖంగా చెప్పినప్పటికీ అంతర్గతంగా జరిగింది వేరని విశ్లేషకుల ఆభిప్రాయం.

కేటీఆర్ తో చర్చలో హరీష్ రావు..పార్టీలో తన ప్రాధాన్యతను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ కు అండగా ఉంటూ చెప్పిన మాట జవదాటకుండా పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా పని చేస్తుంటే అవమానాలకు గురి చేయడం సరికాదని గట్టి స్వరంతో చెప్పారని సన్నిహితుల సమాచారం. ఇకపై ఇటువంటి పునరావృత్తమైతే కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడని హెచ్చరించినట్లు కూడా తెలిసింది.

ఈ నేపథ్యంలో హారీష్ రావుకు పార్టీలో తగిన గౌరవం ఇచ్చేలా..తనతో సమానమైన బాధ్యతలు అప్పగించేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు బావబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరినట్లు ఇద్దరి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ అనుబంధ సంఘాల (ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్) ఇంచార్జ్ తోపాటు రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపే మరో కీలక పదవి ఇచ్చేందుకు కేటీఆర్ ఒప్పుకున్నారని కేసీఆర్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాలను బహిర్గతం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇటీవల కాళేశ్వరం నోటీసుల అందిన తర్వాత హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో వరుసగా రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో కుదిరిన రాజీ వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే సమయం చూసుకొని ప్రకటిద్దామని తొందరపడొద్దని అప్పటికీ వరకు రాముతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కేసీఆర్ సూచించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే వీరద్దరి మధ్య రాజీ కుదిరింది అనే ప్రచారం నిజమేనా ? లేక కేవలం ఊహగానాలేనా? అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ రాజీ కుదిరినా ఎంత కాలం సఖ్యతగా ఉంటారు అనేది అనుమానమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కవిత కోపానికి కారణాలివే..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె పార్టీలోని పరిణామాలపై లేఖ రాశారని ఇప్పటి వరకు ప్రచారంగా మాత్రమే ఉంది. కానీ కవిత తన బాపుకు రాసిన లేఖ ఇప్పుడు బహిర్గతమైంది. ఆ లేఖలోని సారాంశం చూస్తుంటే.. అది లేఖ కాదు.. లేఖాస్త్రం అనే రీతిలో ఉంది.

పార్టీలోని పరిణామాల మీద.. మరి ముఖ్యంగా తన సొదరుడు కేటీఆర్ తీరు మీద కవిత గుస్సాగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. అదంతా అక్షర సత్యమని లేఖలోని అంశాలతో తేటతెల్లమైంది. లేఖలో ఎక్కడా నేరుగా కేటీఆర్ గురించి ప్రస్తావించకున్నా.. కవిత టచ్ చేసిన కొన్ని అంశాలు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసేలా ఉన్నాయి.

ఇప్పుడు లేఖ బయటకు వచ్చేసింది కాబట్టి.. ఆ లేఖలో ఏమున్నాయోననేది ఇక ఓపెన్. కానీ ఆమెకు లేఖ రాసేందుకు ప్రేరేపించిన కారణాలేంటీ..? కేవలం పార్టీలో పెత్తనం కోసమే ఆమె నాన్న, అన్నతో విబేధిస్తున్నారా..? లేక దీనికి మించిన కారణాలు ఏమైనా ఉన్నాయా..? అంటే ఉన్నాయనే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

పార్టీలో కీలకంగా ఉండాలని కవిత కోరుకోవడంలో తప్పేం లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమించారు. ఇప్పటికే ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ తరహాలో ఉద్యమ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్న కవితకు సహజంగానే పార్టీలో కీలకంగా ఉండాలనే కోరిక ఉండడం సహజం. కానీ ఆమె తన నాన్నకు లేఖ రాయడానికి కారణం మాత్రం అంతకు మించేననేది బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

కవిత అసంతృప్తికి కారణం ఇప్పుడు జరిగిన పరిణామాలు కాదని తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఆవేదనకు బీజాలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నాడే పడ్డట్టు సమాచారం. ఓసారి వెనక్కు వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు తెర మీదకు వచ్చిన తొలినాళ్లల్లో లిక్కర్ కుంభకోణం విషయమై కేసీఆర్ మిమ్మల్ని తిట్టారట కదా అని ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడిగారు. ఆ రోజు ఆ ప్రశ్నను నిర్ద్వంధంగా తిప్పికొట్టింది. అది నిజం కాదంటూ కొట్టిపారేశారు కవిత. కానీ అదే నిజమని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు క్లారిటీ వస్తోంది. ఆమె అసంతృప్తికి కారణాలను చూస్తే..


Reason 1:

లిక్కర్ కుంభకోణంలో కవితకు తన కుటుంబం నుంచి వూర్తి స్థాయిలో సహకారం లభించ లేదని సమాచారం. పైగా జైల్లో ఉన్నప్పుడు కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం.. ఆమెను ఈ కేసు నుంచి కానీ.. జైలు నుంచి బయట వేయడంలో నాన్న, అన్నల నుంచి అంతగా కో-ఆపరేషన్ లేదని అంటున్నారు.


Reason 2:

ఇక పార్టీ ఓడిపోయాక జరిగిన ప్రచారం మరో కారణం. పార్టీ ఓటమికి కవితే కారణమని పార్టీలో వారే.. ఓ విధంగా చెప్పాలంటే అన్న కేటీఆర్.. ఆయన అనుచరగణం తనపై ఈ దుష్ప్రచారం చేశారని.. ఆమెతోపాటు ఆమె సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. ఇదేదో తాము కోపంతో అంటున్న మాట కాదని.. నిజాలని నిర్ధారించుకున్నామనేది కవిత వైపు వాదన. ఈ పరిణామం ఆమెను మరింతగా కుంగదీసిందని అంటున్నారు.


Reason 3:

లాస్ట్ బట్ నాట్ లీస్ట్. పార్టీలో.. రాజకీయాల్లో కవితను యాక్టీవుగా ఉండొద్దని నాన్న, అన్న చెప్పేశారని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు. ఇవి గుసగుసలు కావు.. నిజమేనని కవిత సన్నిహితులు చెబుతున్నారు. జైలుకెళ్లొచ్చిన తనకు పెత్తనం ఇవ్వకున్నా ఫర్వాలేదు.. కనీసం యాక్టీవుగా కూడా ఉండొద్దని చెప్పడాన్ని కవిత ఎంత మాత్రమూ లైటుగా తీసుకోలేకపోతున్నారనేది బీఆర్ఎస్ వర్గాల టాక్.


ముక్తాయింపు:

ఇప్పుడు కవిత అన్న మీద విపరీతమైన కోపంతో రగిలిపోతున్నారని అంటున్నారు. తనను రాజకీయంగా అణగదొక్కడంలో అన్న కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. నాన్నకు ఉన్నవి లేనివి చెప్పి.. తనకు.. తన తండ్రికి గ్యాప్ పెంచారని ఆమె అనుమాన పడుతున్నారట. తన అసంతృప్తిని వివిధ సందర్భాల్లో తన తండ్రి వద్ద ప్రస్తావించినా.. లాభం లేకపోవడంతో ఆమెకు లేఖ రాయక తప్పలేదని కవిత వర్గం చెబుతోంది. ఈ క్రమంలో తన భవిష్యత్ కంటే.. అన్న కేటీఆర్ నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి తెలియచెప్పేందుకు కవిత లేఖాస్త్రం ఎక్కుపెట్టారని బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది.


భయం లేకుంటే.. బరితెగించరా..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో ఆసక్తిర చర్చ జరుగుతోంది. 2009-14 మధ్య కాలంలో జరిగిన పరిణామాలే మళ్లీ జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం నాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు.. ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ చర్చ ఏంటంటే.. నేతలు.. జైళ్లు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత పదేళ్లల్లో కేసీఆర్, గత ఐదేళ్లల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వాల్లోని వైసీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు.. తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వాలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు.. ఇంకొందరు అధికారులు జైళ్లపాలయ్యారు. త్వరలోనే మరింత మంది అధికారులు.. కీలక నేతలు జైళ్లకు వెళ్లే అవకాశమూ కన్పిస్తోంది. వైసీపీ అధినేత.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని చర్చ జరుగుతోంది. ఇదే చర్చల్లో భాగంగా నేరుగా కాకున్నా.. పరోక్షంగా వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి పేరును కూడా కొందరు తెర మీదకు తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో సామాన్యుల్లో మరి ముఖ్యంగా న్యూట్రల్ పర్సన్సులో ఓ చర్చ జరుగుతోంది. చక్కగా రాజకీయం చేసుకోకుండా.. ఎందుకీ రచ్చ అంటున్నారు. తాము చేసే అవినీతి తమను జైళ్లకు పంపుతుందని తెలిసి కూడా డబ్బు సంపాదన కోసం ఎందుకు బరితెగిస్తున్నారు..? దీనికి కారణాలేంటీ..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, గాలి జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, కేసీఆర్, కేటీఆర్, కవిత ఇలా చాలా మందిపై అవినీతి ఆరోపణల కేసులున్నాయి. వీళ్లే కాకుండా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీద కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు ఇప్పటికే జైళ్లల్లో ఉండగా.. ఇంకొందరు జైళ్లకు వెళ్లి వచ్చారు.. ఇంకొందరు జైళ్లకు వెళ్తారనే ప్రచారం ఉంది.

ఇలా జైళ్లకు వెళ్లి వచ్చిన వారు కూడా మళ్లీ అలాంటి పొరపాట్లే ఎందుకు చేస్తున్నారు అంటే.. దానికి ప్రతి ఒక్కరూ తలో రకమైన కారణం చెబుతారు. రాజకీయ నాయకుడైతే.. తమ పార్టీ ప్రత్యర్థులు తమపై కక్ష సాధిస్తున్నారని.. తమకు అడ్డంకే లేకుండా చేసుకోవడానికి గానూ.. ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ స్టీరియోటైప్డ్ స్టోరీస్ తరహాలో ఒకే మాట చెబుతారు. జైళ్లకు వెళ్తామని తెలిసి కూడా వైట్ కాలర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. వీరు అవినీతికి అలవాటు పడిపోయారా..? లేక మరే ఇతర కారణమేదైనా ఉందా..? పార్టీ అధినేతలే స్వయంగా బరి తెగిస్తే.. మిగిలిన నేతలు.. కార్యకర్తలు కూడా తమకు అందిన కాడికి దోచుకునేందుకు అలవాటు పడతారు కదా అనేది తాజా ఆందోళన.

ఇక జైళ్లకు వెళ్తామని తెలిసి కూడా అవినీతి చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. మారిన రాజకీయం అనే సమాధానం వస్తుంది. అవును రాజకీయమే ప్రధాన కారణం. పదవి కోసం.. అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తారు.. పార్టీలు పెడుతున్నారు. అధికారం దక్కించుకోవాలంటే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి వస్తోంది. ఓ నియోజకవర్గంలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే.. ఆ సెగ్మెంట్ నుంచి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..? తక్కువలో తక్కువ 150 కోట్ల రూపాయలు. అంటే ప్రతి పార్టీ సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టక తప్పని సరి అవుతుంది. అయితే ఇది అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా ఖర్చు అవుతుందని చెప్పలేం. కొన్నింటిలో తక్కువ ఖర్చు కావచ్చు.. ఇంకొన్నింటిలో ఎక్కువ ఖర్చు కావచ్చు. ఈ లెక్కన నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయల మేర యావరేజ్ ఖర్చు అవుతుందని చెప్పొచ్చు.

దీని ప్రకారం ఓ రాజకీయ పార్టీ ఏపీలో ఎన్నికల్లో పోటీ చేయడానికి తక్కువలో తక్కువ 7000 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికొచ్చేసరికి.. ఆ ఖర్చు 4760 కోట్ల రూపాయలుగా ఉంటుందని ఓ అంచనా. ఇంత ఖర్చు పెట్టినా.. అధికారంలోకి వస్తారనే గ్యారెంటీ లేదు. దీని కోసం జరిగే రాజకీయం వేరుగా ఉంటుంది. ఎత్తులు పైఎత్తులు మామూలే. మరి ఇంత ఖర్చు అవుతున్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు.. అవకాశం దక్కినప్పుడు సంపాదించుకోకుంటే ఎలా..? అనేది మొదలైంది. దీంతో రాజకీయం వ్యాపారంగా మారింది. పాలిటిక్స్.. బిజినెస్సుగా ఎప్పుడైతే మారిందో.. అప్పుడు అందినకాడికి సంపాదించుకోవడం అలవాటుగా మారుతుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి.. రూల్స్, రెగ్యులేషన్స్ పట్టించుకోరు. ఇదే సమయంలో మేం సంపాదిస్తున్న డబ్బు.. మా కోసం కాదు.. రాజకీయం కోసం అనే థియరీ మొదలు పెడతారు. అవినీతి తప్పు కాదు.. చేయకపోతేనే తప్పు అని ఆలోచించేలా చేస్తారు.

ఇక వీరు ఈ విధంగా విచ్చలవిడిగా వ్యవహరించడానికి కారణం.. మన న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం. అవినీతి కేసులు అంత త్వరగా తేలవు. అందునా రాజకీయ నేతల మీదున్న అవినీతి కేసులు ఎంత మాత్రమూ తేలవు. ఒకవేళ తేలినా.. జీవిత కాలం అయిపోతుందనే బలమైన నమ్మకం కొందరి రాజకీయ నేతలకు ఉండడం కూడా వైట్ కాలర్ నేరాలు రాజకీయాల్లో పెరిగిపోవడానికి ప్రధాన కారణం. జగన్ అక్రమాస్తుల కేసే చూస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదై సుమారు 14 ఏళ్లు అవుతుంది. కొంత మేర ఈ కేసుల విషయంలో దర్యాప్తు జరిగినా.. చాలా కాలం నుంచి ఈ కేసుల దర్యాప్తు నత్తనకడన సాగుతుంది. ఈ కేసులు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తాయో తెలియడం లేదు. పరిస్థితి చూస్తుంటే.. మరికొన్నేళ్ల పాటు.. జీళ్ల బంకలా ఈ కేసులు సాగడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ 14 ఏళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఐదేళ్ల ఏపీని పరిపాలించారు. ఆయన టైమ్ బాగుండి ఉండుంటే.. మళ్లీ గెలిచేవారు. కానీ 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అంటే అవినీతి కేసులున్నా.. కోర్టుల్లో ఆ కేసులు త్వరగా తేలవు కాబట్టి.. తమ రాజకీయాన్ని విచ్చల విడిగా చేసుకోవచ్చని రాజకీయ నాయకులకు అర్థమైంది. దీంతో అవినీతికి వెనుకాడడం లేదు.

ఇక జైళ్ల పాలవుతున్నా.. అవినీతి విషయంలో తగ్గేదెలే అని కొందరు రాజకీయ నేతలు వెనకడుగు వేయకపోవడానికి మరో కారణం హీరో వర్షిప్. ఒకప్పుడు జైలుకు వెళ్లడానికి సిగ్గు పడే రోజులు ఉండేవి. కానీ ప్రస్తుతం జైలుకు వెళ్తే పొలిటికల్ మైలేజ్ ఎంత వస్తుందని లెక్కలు వేస్తున్నారు. విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో జైలుకు వెళ్లి వస్తే హీరో వర్షిప్ వస్తుందని, రాజకీయంగా కలిసి వస్తుందని కొందరు నమ్ముతున్నారు. జగన్ విషయంలో అది నిజమైందనే విశ్లేషణలు కూడా వచ్చాయి.

కానీ జగన్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చాక గెలిచారు కానీ.. అప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇది చంద్రబాబు గెలుపునకు సగం కారణం అంతే కానీ.. చంద్రబాబు జైలుకు వెళ్లారని మాత్రమే ఆయన గెలిచారని అనుకోవడానికి లేదు. ఇక రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాక గెలిచారు. కానీ 2023 ఎన్నికల నాటికి కేసీఆర్ ఫ్యామ్లీ మీద అన్ని వర్గాలు విరుచుకుపడడం మొదలైంది. ఇది రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ఇక కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా ఓటమి పాలయ్యారు. కాబట్టి అధికారానికి.. జైలు జీవితానికి సంబంధం లేదని అర్థమవుతుంది. కానీ ఎందుకో జైలుకు వెళ్తే హీరోగా చూడడం ఇప్పుడు రివాజుగా మారింది.

జగన్ జైలు ఎపిసోడ్ తర్వాత ఆయన్నో హీరోగా చూపే ప్రయత్నం జరిగింది. ఇది తెలుగు పొలిటిషీయన్లకు బాగా నచ్చింది. దీంతో తమ రాజకీయ ఎదుగుదలకు జైలు జీవితం అనేది కీలకం అనుకుంటున్నారు. దీంతో జైలుకు వెళ్లడానికి కొందరు మానసికంగా సిద్దపడిపోతున్నారు. అదో ప్రివిలేజ్ గా భావిస్తున్న పరిస్థితి. రాజకీయ నేతల ఆలోచనా విధానం ఈ విధంగా ఉంటే.. జైలు అనే భయమే ఉండదు. దీంతో అవినీతి చేస్తే ఇబ్బంది పడతామనే భావనే రాదు కాబట్టి.. కొందరు రాజకీయ నేతల అవినీతికి అంతే లేకుండా పోతోంది. జైళ్లకు వెళ్లి వచ్చినా.. ఏముందిలే జైలే కదా అని తెగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ నేతల తీరు ఈ విధంగా ఉంటే.. కొందరు అధికారుల తీరు మరీ అరాచకంగా ఉంది. కొందరు అధికారులు కూడా సీఎం స్థానంలో ఉన్న వారికి నిబంధనలకు విరుద్దంగా.. అడ్డగోలుగా సహకరించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఐఏఎస్ అధికారులు ధనుంజయ్ రెడ్డి, శ్రీలక్ష్మీ. ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పటికీ కొందరు అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. కొందరు అవినీతి ఐఏఎస్ అధికారులు అయితే.. తాము అవినీతి చేయడమే కాకుండా.. ఎలా చేస్తే డబ్బులు వస్తాయోననే అంశాన్ని ముఖ్యమంత్రులకు.. మంత్రులకు.. సలహాలిచ్చే స్థాయికి చేరిపోయారు. ఇది క్షమించరాని అంశం. కానీ వీళ్లని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ ఐఏఎస్ అధికారి పరారయ్యారనే వార్తలు రావడానికంటే సిగ్గుచేటైన అంశం ఉండదు. కానీ ఇలాంటి వాటిని లైట్ గా తీసుకుంటూ.. అవినీతి చేసి డబ్బు పోగేయాలనే భావన కొందరు అధికారుల్లో కన్పిస్తోంది.

ఓ విధంగా చెప్పాలంటే.. రాజకీయం.. పరిపాలన.. కేసులు.. కోర్టులు.. జైళ్లు.. అనేది ఇవాల్టీ రోజుల్లో సాధారణమైన అంశంగా మారిపోయింది. దీంతో జైలు.. బెయిలు.. సీఎం ఛైరు.. అనే వాతావరణం ఏర్పడింది. ఈ విధానం మారాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఏది మంచి.. ఏది చెడు.. ఎవరికి ఓటేయాలి.. ఎవరికి ఓటేయకూడదు అనే విచక్షణతో ఆలోచన చేయాలి. ఆ స్పృహ రానంత వరకు విశ్లేషణల్లో విషయాలు మారతాయేమో కానీ.. సమాజంలో మార్పు మాత్రం రాదు.

నాడు.. నేడు..

చేసిన పాపం అని కొందరు..

రెడ్ బుక్ ఫలితమని ఇంకొందరు..

ఎవరి వాదన ఎలా ఉన్నా.. వీళ్ల పరిస్థితి మాత్రం నేడు ఇలా ఉంది.

నాడు వారు ఎలా ఉండేవారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి..

తన్నీరు లేకుంటే.. బీఆర్ఎస్ పార్టీకి కన్నీరే..

ట్రబుల్ షూటర్... నేటి బీఆర్ఎస్, నిన్నటి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి హరీష్ రావుకు ఉన్న ట్యాగ్ లైన్ ఇది. కేసీఆర్ కు పార్టీలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఆ సంక్షోభాన్ని సమర్ధంగా పరిష్కరించి... పార్టీ ఊపిరి పీల్చుకునేలా చేసే నాయకత్వ సామర్ధ్యం హరీష్ సొంతం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2018లో కొడంగల్ లో ఓడించడం వెనుక కూడా హరీష్ మానేజ్ మెంట్ స్కిల్స్ ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఐతే... రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ ను కేసీఆర్ సైడ్ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకోలేదు. ఒక్కడినే తీసుకోకపోతే సమస్య వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ ను కూడా కొద్ది రోజులు కేబినెట్ కు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ కేబినెట్ లోకి తీసుకున్నారు. పేరుకు పెత్తనమే తప్ప... హరీష్ మాట చెల్లుబాటు కాకుండా చేశారు. క్రమంగా ఆయన స్థాయిని పార్టీలో తగ్గిస్తున్న సంకేతాలు ఇచ్చారు. 

తర్వాత కాలంలో హరీష్ ను కేవలం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేశారు. సిద్ధిపేట – హైదరాబాద్ తప్ప మరో చోటకు హరీష్ వెళ్లలేని పరిస్థితి సృష్టించారు. తీవ్ర ఉక్కపోతకు గురి చేశారు. సహజంగా ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరున్న హరీష్... పంటి బిగువన ఈ ఉక్కపోతను భరించారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సమయానికి పరిస్థితి పరాకాష్ఠకు వెళ్లింది. తండ్రీ కొడుకులు కలిసి హరీష్ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేశారు. వరంగల్ సభకు ముందు హరీష్ ను ఇన్ ఛార్జ్ అని ప్రకటించారు. తర్వాత ఫాంహౌస్ లో ఏం చర్చలు జరిగాయో తెలియదు. సభా వేదికే మారిపోయింది. వరంగల్ ఎల్కతుర్తి నుండి మేడ్చల్ వద్దకు మారింది. సీన్ లో కేటీఆర్ రంగ ప్రవేశం చేసి మొత్తం కబ్జా పెట్టేశారు. పరిస్థితి మొత్తం కేటీఆర్ నియంత్రణలోకి వచ్చింది అనుకున్న తర్వాత సభ వేదికను మళ్లీ వరంగల్ కు మార్చారు. అక్కడ నుండి హరీష్ బొమ్మను పూర్తిగా చింపేసే దిశగా అడుగులు పడ్డాయి. ఏప్రిల్ 27 ఎల్కతుర్తి సభ నాటికి ఎటు చూసినా కేసీఆర్, కేటీఆర్ తప్ప మరో పేరు, బ్యానర్, జెండా లేకుండా చేశారు. అది రజతోత్సవ సభనా లేక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే వేదికనా అన్న స్థాయిలో పరిస్థితి మారిపోయింది. 

మొదటి నుండి పార్టీలో ఉండి... హరీష్ తో కష్టం నష్టం పంచుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ పరిణామాలపై లోలోపలే మథన పడిపోయారు. హరీష్ భవిష్యత్ పై ఆందోళనలోకి జారి పోయారు. ఆయనే బాస్ అనుకున్న వాళ్లంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో హరీష్ శకం ముగిసిందన్న ఫీల్ వచ్చేసింది. ఆయనను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ పడ్డ శ్రేణులు ప్రత్యామ్నాయాలపై చర్చించడం మొదలు పెట్టాయి. హరీష్ బీజేపీలోకి వెళ్లిపోవాలని కొందరు... లేదు సొంత పార్టీ పెట్టాలని కొందరు విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రబుల్ షూటర్ మాత్రం అదే ఓపికతో, సహనంతో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పైకి మౌనంగా చూస్తూ ఉండిపోయారు. 

సీన్ కట్ చేస్తే... బీఆర్ఎస్ పార్టీలో కొత్త సంక్షోభం తెర మీదకు వచ్చింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాగం వినిపించడం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతావ్... అని సోది చెప్పే వాళ్లతో చెప్పించుకోవడం, పదేళ్లలో (కేసీఆర్ పాలనలో) సామాజిక తెలంగాణ సాధించలేదని మాట్లాడటం, కేటీఆర్ గొప్పగా చెప్పుకునే తలసరి ఆదాయం విషయంలో కవిత భిన్నమైన లెక్కలు చెప్పడం... దాల్ మే కుచ్ కాలా హై అన్న అనుమానాలను సృష్టించింది. దీనికి కొనసాగింపుగా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కు తన మనోవేధనను వివరిస్తూ లేఖ రాసిందన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. అట్టడుగున ఉన్న పలువురు పార్టీ శ్రేణులను పిలిపించుకుని కవిత చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న సందేహాలకు బలం చేకూర్చాయి. 

సరిగ్గా 15 రోజుల క్రితం హరీష్ అడ్రస్ గల్లంతైందనుకున్న పరిస్థితుల నుండి తాజా పరిణామాలతో మళ్లీ హరీష్ తెర మీదకు వచ్చారు. ట్రబుల్ షూటర్ అన్న పేరుకు తగ్గట్టే ఈ సంక్షోభ సమయంలో మళ్లీ హరీష్ దిక్కయ్యారు. కేటీఆర్ స్వయంగా రెండు రోజులు హరీష్ ఇంటికి వెళ్లి చర్చల జరిపారు. ఏం చెప్పారో, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ, కవిత కలకలం నేపథ్యంలో హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ ను ఉక్కపోతకు గురి చేసిన కేటీఆర్... ఇప్పుడు అదే హరీష్ శరణు కోరుతూ ఆయన ఇంటికి వెళ్లడం హరీష్ రావు సామర్ధ్యాన్ని చెప్పకనే చెప్పింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో... “అంతలోనే ఎంత మార్పు!!” అన్న చర్చ నడుస్తోంది. 

బాటమ్ లైన్..: హరీష్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని భావిస్తే.. ఆ పార్టీ ప్రభావం జీరో అన్నది మరోసారి రుజువైంది.

అధ్యక్షా రేసులో ఈటెల... చివర్లో ట్విస్టు

రేపో మాపో రాష్ట్ర బీజేపీ పగ్గాలు పట్టుకుందామని ఆశ పడుతున్న ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసు ఇరకాటంలో పడేసినట్టుంది. బీజేపీ అధిష్టానం నుండి ప్రెసిడెంట్ అపాయింట్ మెంట్ లెటర్ వస్తుందని ఆశించారు.

ఈలోగానే కాళేశ్వరం కమిషన్ నుండి విచారణ నోటీసు రావడం ఆయనకు చికాకు తెప్పించే అంశమే. అమిత్ షా ఆశీస్సులు నాకే ఉన్నాయి... నేనే ప్రెసిడెంట్ అని నమ్మిన ఈటెలకు ఇప్పుడు ఇది కొత్త చిక్కు అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్ణయం జరుగుతుందా!? జరిగితే ఈటెలకే ఇస్తారా...!? సారీ బాస్ అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సహజంగా ఐతే కాళేశ్వరం కమిషన్ నుండి నోటీసు రావడాన్ని ఈటెల అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. తనను అస్సైన్డ్ భూముల విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ఆ అస్త్రాన్ని వాడుకోవచ్చు. కానీ, ఈటెల రాజేందర్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు. కమిషన్ విచారణకు హాజరవుతా అంటూనే... దేవరాయాంజల్ భూముల విషయంలో కేసీఆర్ తప్పు చేసినట్టే ఇవ్వాళ రేవంత్ రెడ్డీ తప్పు చేస్తున్నాడని ఈటెల మండి పడుతున్నారు.

రేవంత్ రెడ్డి బెదిరిస్తే తాను భయపడనని... కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఈటెల హెచ్చరిస్తున్నారు. ఒక వైపు రేవంత్ రెడ్డి బెదిరిస్తే బెదరను అంటూనే... మరోవైపు కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తిరిగి బెదిరిస్తున్నారు ఈటెల.

ఈ నోటీసులతో ఈటెల రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి రేపో మాపో అందుకోవాల్సిన అధ్యక్ష పదవికి ఈ నోటీసులు ఏమైనా చెక్ పెడతాయేమోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఇక కమిషన్ ముందు విచారణకు హాజరై ఏం చెప్పాలన్నది మరో సమస్య. కేసీఆర్ తప్పు చేశాడు అని చెబితే ఆ నాటి కేబినెట్ మంత్రిగా ఆ తప్పులో తనకూ వాటా ఉంటుంది. కేసీఆర్ తప్పు చేయలేదని చెబితే... ఈటెల బీజేపీలో చేరినా ఇంకా కేసీఆర్ పక్షానే నిలబడ్డాడన్న రాజకీయ వాదన తెర మీదకు వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఈటెల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బహుషా అందుకేనేమో ఆయన ఈ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు.

జూన్5 - బిగ్ డే

బొట్టు బొట్టు నా రక్తాన్ని రంగరించి కాళేశ్వరం కట్టానని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇప్పుడు ఆ కాళేశ్వరమే కాలనాగై వెంటాడుతోంది. పీసీ ఘోష్ కమిటీ కాల పరిమితి ముగిసింది. నివేదిక సిద్ధమైంది... రేపో మాపో ప్రభుత్వానికి సమర్పిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సడెన్ గా కమిషన్ కాల పరిమితి మరో రెండు నెలలు పొడిగిస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కథ సుఖాంతమైంది అని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.

ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టాయి. కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ అంటూ ఆరోపణలు మొదలు పెట్టాయి. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా... కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? విద్యుత్ కమిషన్ విషయంలో న్యాయస్థానం నుండి ఊరట పొందినట్టు... ఇక్కడ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? చివరిగా కాళేశ్వరం విచారణలో ఏం తేలబోతోంది? కమిషన్ నివేదిక ఏం చెప్పబోతోంది? ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? కాళేశ్వరం అవినీతి శకలాలు కేసీఆర్ ను తాకుతాయా? లాంటి ప్రశ్నలు మళ్లీ తెర మీదకు వచ్చాయి.

తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటి మీద కునుకు లేకుండా తనను వెంటాడిన కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి అంత తేలికగా వదిలేస్తాడని ఎవరూ ఊహించలేరు. కాకపోతే, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఒక తేడా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుల పై కక్ష విషయంలో కేసీఆర్ ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించారు. తాను అనుకుంటే చాలు ఏదో ఒక నెపంతో ఊచలు లెక్కబెట్టించారు. నాయకుల ఇళ్ల తలుపులు బద్ధలు కొట్టి మరీ వికృత కక్షలకు పాల్పడ్డారు. ఐతే, రేవంత్ రెడ్డి స్కూల్ వేరు. ఆయన కేసీఆర్ అండ్ కోను పద్ధతిగా, చట్టబద్ధంగా ఊచలు లెక్కబెట్టించాలని ఆశ పడుతున్నారు. ఏదీ కావాలని చేశారన్న భావన ప్రజలకు రాకూడదన్న కోణంలో ఆయన కేసీఆర్ ఫ్యామిలీని ఊచలు లెక్కబెట్టించాలని ఆశిస్తున్నారు.

అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫార్ములా కారు రేసు, విద్యుత్ కమిషన్ విచారణ లాంటి వాటిల్లో ఇప్పటి వరకు ఊచించినంత తీవ్రంగా ఎలాంటి చర్యలు లేవు. ప్రతి కేసులో తప్పించుకోలేని విధంగా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ప్రధాన ఘట్టానికి తెర లేపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. న్యాయ పరంగా ఏ చిన్న లొసుగు లేకుండా, ఎక్కడా జారీ పోయే అవకాశం లేకుండా ఫిక్స్ చేయాలన్నది ఆయన ప్రయత్నంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కాళేశ్వరం విషయమే తీసుకుంటే... పీసీ ఘోస్ కమిషన్ విచారణను ఐదారు సార్లు పొడిగించారు. అప్పటి ఇంజనీర్లు, ఉన్నతాధికారులను పదే పదే పిలిచి విచారించారు. కొందరు అధికారుల నుండి అఫిడవిట్లు తీసుకున్నారు. హరిరాం లాంటి ఈఎన్సీ పై ఏసీబీ దాడి చేయించి... అక్రమాస్తుల చిట్టా విప్పారు. మరోవైపు విజిలెన్స్ విచారణలు చేయిస్తున్నారు. ఒక వైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు కమిషన్ విచారణ, మరోవైపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇట్లా అన్నీ వైపుల నుండి కచ్చితమైన సాక్ష్యాలతో గత పాలకులను దోషులుగా తేల్చే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నారు. కేసీఆర్ అండ్ కో విచారణ లేకుండానే కమిషన్ తన విచారణను ముగిస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మళ్లీ రెండు నెలలు కమిషన్ కాల పరిమితి పెంచి... గులాబీ శ్రేణుల్లో అలజడి రేపారు.

ఈ నేపథ్యంలో కమిషన్ విచారణ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అన్నట్టుగా సాగబోతోంది. నిన్నటి వరకు అధికారులు, జల నిపుణులతో మాత్రమే విచారణ జరిపిన కమిషన్... ఇక రాజకీయ నాయకుల విచారణ మొదలు పెట్టబోతోంది. ఇందులో మొదటగా జూన్ 5న కేసీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన వెళతారా... వెళ్లరా... వెళ్లకుండా న్యాయస్థానం నుండి ఏమైనా రిలీఫ్ కోరతారా... వెళితే కమిషన్ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ వెళ్లి... తర్వాత జూన్ 6 న హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరైతే విచారణ ఇక కొలిక్కి వచ్చినట్టే. కేసీఆర్ గైర్హాజరై... హరీష్ రావు మాత్రమే కమిషన్ ముందుకు వెళితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మరో అంశం. కేసీఆర్ వెళ్లకుండా హరీష్ మాత్రమే వెళితే... హరీష్ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు... కేసీఆర్ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక వీళ్లిద్దరితో పాటు కేసీఆర్ పాత సహచరుడు ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కమిషన్ ముందు ఏం చెబుతారన్నది మరింత ఆసక్తి కరం. దేవాలయ భూములు, అసైన్డ్ భూముల విషయంలో ఈటెలను కేసీఆర్ తీవ్రంగా వేదించారు. తనను మానసికంగా, ఆర్థికంగా వేదించిన కేసీఆర్ గుట్టును ఈటెల కమిషన్ ముందు విప్పుతారా... లేక మాజీ బాస్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బీఆర్ఎస్ లైన్ లోనే తన వాదన వినిపిస్తారా..? అనేది చూడాల్సి ఉంది.

కాళేశ్వరం కలకలం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.

ఇక ఏపీలో నిమ్మల వర్సెస్ నారాయణ.. ఇద్దరు మంత్రుల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ జీవనాడి, గ్రోత్ ఇంజిన్ ప్రాజెక్టులు.. ప్రస్తుతం రేసులో ముందు ఉన్న నిమ్మల..

అమరావతి
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అయితే విభజన తర్వాత.. ఏపీకి మరో పేరూ వచ్చింది.. అమరావతి, పోలవరం. ఈ రెండు ఏపీ అభివృద్ధికి.. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులు గత ఐదేళ్ల కాలంలో పెద్దగా ముందుకు నడవని పరిస్థితి కన్పించింది. రాజధాని నిర్మాణం అవసరమే లేదని.. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించవచ్చని.. అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని జపించి.. అమరావతి ప్రాజెక్టును అటకెక్కించేసింది గత ప్రభుత్వం. ఇక మరో రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడుగులు అంతంత మాత్రంగానే గత ప్రభుత్వంలో పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం 3-4 శాతం పనులు మాత్రమే జగన్ హయాంలో జరిగాయి. ఇక ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయలేదు జగన్ ప్రభుత్వం. ఇది చాలదన్నట్టు.. గత ప్రభుత్వ పెద్దలు.. అధికారుల వైఖరి కారణంగా ఢయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు కొత్తగా ఢయా ఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి. ఇదీ అమరావతి. పోలవరం ప్రాజెక్టుల విషయంలో కూటమి అధికారంలోకి రాకముందు వరకు ఉన్న పరిస్థితి.

అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ క్రమంలో ఏపీ పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రుల మధ్య ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగతోందని అంటున్నారు. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులుగా ఉన్న ఈ రెండింటికీ నారాయణ-నిమ్మల మంత్రులుగా ఉన్నారు. తమ తమ పరిధిలోని ప్రాజెక్టులను ఎవ్వరూ ముందుగా కంప్లీట్ చేస్తారు.. ఏ మంత్రి ఈ ప్రాజెక్లులకు త్వరగా ఓ రూపును తెస్తారు.. గ్రోత్ ఇంజిన్, జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టులను జాతికి ఎంత త్వరగా ఎవరు అంకితం చేస్తారనేది ఇప్పుడు హాట్ డిస్కషనుగా మారింది. ఈ రన్నింగ్ రేసులో ఇప్పటికే నిమ్మల ముందు వరుసలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తామని ధీమాగా చెబుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కానీ మంత్రి నారాయణ పరిధిలోని అమరావతి ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తిగా పనులు మొదలు కాలేదు. కేంద్రం రాజధాని నిర్మాణానికి తమ వైపు నుంచి ఆర్థిక చేయూత అందించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించినా.. దాన్ని వెంటనే యాక్టీవేట్ చేయించడంలో మంత్రి నారాయణ విఫలమయ్యారనే చర్చ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకర్ల లాబీయింగ్ విషయంలో మంత్రి నారాయణ ఘోరంగా విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే కొందరి కాంట్రాక్టర్లకు సహకరించడం కోసం నారాయణ చేస్తున్న ఒత్తిడి కారణంగా అమరావతి ప్రాజెక్టు పనుల రీ-లాంఛ్ జాప్యమైందనేది మరో వాదన

ఈ చర్చ సంగతి ఎలా ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు కంటే అమరావతికి రూపే త్వరగా వచ్చే ఛాన్స్ కన్పిస్తోందనేది సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రీ-లాంఛ్ పనులు ప్రారంభం కావడానికి జాప్యం అయినా.. తాము లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తామనే ధీమా నారాయణ టీములో కన్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ రీ-లాంఛ్ పనులు ప్రారంభించేశారు కాబట్టి.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. అనుమతులు ప్యూర్లీ మన దేశానికి సంబంధించిన వ్యవహరమేనని.. కానీ అమరావతి అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైందని అంటున్నారు.

ఈ విధంగా ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇద్దరు మంత్రులు చాలా కీలకమైన ప్రాజెక్టులను తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇదేదో రాజకీయపరమైన వ్యవహరంగా కాకుండా.. రాష్ట్రానికి.. రాష్ట్రాభివృద్ధికి ముడి పడి ఉన్న అంశంగా భావించి.. పనులను పరుగులు పెట్టించాలని కోరుకుంటున్నారు. ఇందులో ఏ మాత్రం అలక్ష్యం చేసినా.. తేడాలు చేసినా.. ఆ మంత్రులను ప్రజలు ఎన్నటికీ క్షమించరని కూడా హెచ్చరిస్తున్నారు నిపుణులు.

విజయసాయి దెబ్బ.. వైసీపీ అబ్బ..

రక్షకుడే శిక్షకు కారకుడు కానున్నారా..?
అంతఃపుర రహస్యాల గుట్టును విజయ సాయి విప్పనున్నారా..?
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారనున్నారా..?
వైఎస్ కుమార్డుగా జగన్ చేసిన అక్రమాల జాబితాను ఆధారాలతో సహా విజయ సాయి అందించనున్నారా..?
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.

అమరావతి
ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో ఇలాగే జరగబోతోందా..? ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో విబేధించారు. దానికి కారణాలు కోటరీ మీదకు నెట్టినా.. విజయసాయి ఆగ్రహం మాత్రం నేరుగా తన మాజీ బాస్ జగన్ మోహన్ రెడ్డి మీదే ఉందనే చర్చ ఇప్పటికే ఏపీ పొలిటికల్ సర్కిల్సులో ఉంది. వైసీపీ వరకు.. లేదా వైఎస్ ఫ్యామ్లీ వరకు విజయ సాయిరెడ్డి అంటే ఏదో మామూలు ఆడిటర్ కాదు. అంతఃపురం రహస్యాలన్నీ తెలిసిన విభీషణుడు లాంటి వాడు.

వైఎస్ కుటుంబంలో మూడు తరాలు అంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలకు చెందిన ఆస్తిపాస్తుల గురించి ఇంచ్ ఇంచ్ తెలిసిన వాడు. అంతా సాఫీగా ఉంటే.. విజయసాయి రెడ్డి వల్ల వైఎస్ కుటుంబానికి.. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు.. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు.. ఎఫ్ఐఆర్ లు.. ఛార్జీ షీట్లు.. వంటి వ్యవహరాలు.. జైళ్లు.. బెయిళ్లు వంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ప్రతి అంశమూ జగను కంటే ఎక్కువగా విజయ సాయిరెడ్డికే ఎక్కువగా తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్తే.. ఆయన్ను వెన్నంటి ఉన్నారు విజయసాయి.. ఓ విధంగా చెప్పాలంటే అక్రమాస్తుల వ్యవహరంలో జగన్-విజయసాయి రెడ్డిది పాలు-నీళ్ల బంధం.. అలాగే వెలుగు నీడ అనుబంధం.

అలాంటి విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిది విబేధించారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే మద్యం స్కాంలో జరిగిన చాలా లోగుట్టు వ్యవహరాలను సిట్ బృందానికి.. ప్రభుత్వ పెద్దలకు వివరించేశారని సమాచారం. ఇదంతా ఓ ఎత్తు అయితే.. అసలు జగన్ మోహన్ రెడ్డి మీదున్న సీబీఐ-ఈడీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. చాలా కాలంగా చలనం లేకుండా అలా పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. మారిన పరిణామాలతో జగన్ మోహన్ రెడ్డి మీదున్న పాత కేసులన్నీ మళ్లీ క్యూ కట్టి కోర్టు ముందుకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే.. సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి రెడ్డి జగనుకు సంబంధించిన గుట్టును విప్పనున్నారా అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారుతారా అనే చర్చ కూడా విపరీతంగా జరుగుతోంది. ఎందుకంటే.. జగన్ మీద.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద విజయసాయి రెడ్డి చాలా సీరియస్సుగా ఉండడమే కారణమంటున్నారు. జగన్ కోసం.. అంతా తానై చేయడమే కాకుండా.. జైలుకు కూడా వెళ్తే.. తనకు కాకుండా.. వేరే వారికి ప్రయార్టీ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని విజయసాయి రెడ్డి భావిస్తున్నారట. దీంతో వీలైనంత వరకు అంతఃపురం రహస్యాలను బయటపెట్టడానికి ఇప్పటికే టీడీపీ పెద్దలతో ఒప్పందం కుదిరిపోయిందనే చర్చ యమ జోరుగా సాగుతోంది.

ఇదే కనుక జరిగితే.. ఏపీలో రాజకీయాలు భవిష్యత్తులో చాలా మలుపులు తిరగడమే కాదు.. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీలో జరుగుతున్న చర్చ.

షర్మిళలో ఎట్టకేలకు చలనం..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటేలా కార్యక్రమం నిర్వహించిన షర్మిళ..
వైఎస్ ఛర్మిషాను వాడుకోలేకపోతున్న షర్మిళ.
దారి తప్పిన షర్మిళను దారిలో పెట్టేదెవరని కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ.

అమరావతి
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు పదేళ్లకు పూర్వమే చనిపోయింది. విభజన పాపం ఆ పార్టీని వెన్నాడి.. వేటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించలేకపోతున్నారు.. ఆ పార్టీ చేసిన తప్పును మరిచిపోలేకపోతున్నారు. దీనికి తగ్గట్టు వైఎస్సార్సీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడంతో కాంగ్రెస్ ఉనికి చాటుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాస్తో కూస్తో పట్టాలెక్కిద్దామనే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ తనయ షర్మిళను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది.. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది.

షర్మిళ రాకతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒకట్రోండు స్థానాలైనా సాధిస్తుందేమోనని ఆశపడింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ అది నెరవేరలేదు. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఓటమిని నమోదు చేసుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడానికి తాను.. తాను చేసిన ప్రచారం కూడా ప్రధానమైనదేనని షర్మిళ ఆ క్రెడిట్టులో కొంత భాగాన్ని తన ఖతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసిన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని.. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వైసీపీ నుంచి వలసలు వస్తాయని 2024 ఎన్నికలు ముగిసిన తొలినాళ్లల్లో అనుకున్నారు. షర్మిళ వైఎస్ కుమార్తె కాబట్టి.. వైఎస్ జగన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు కాబట్టి.. ఇక కుమార్తె వైపు వైసీపీ నేతలు.. శ్రేణులు చూస్తారని అంతా అంచనా వేసుకున్నారు.

అయితే ఆ అంచనాలను తలకిందులు చేసింది వైఎస్ షర్మిళ. ఎన్నికల ప్రచార సమయంలో ఏదో కొద్దిపాటి హడావుడి చేసిన షర్మిళ.. ఆ తర్వాత ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపలేకపోతున్నారు. ఎన్నికలకు ముందైనా.. వైసీపీ నుంచి కొంత మంది వచ్చారేమో కానీ.. ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చేరికలు లేవు. సరికదా.. షర్మిళ తీరుతో విసిగిపోయిన వారు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ అసమ్మతి గ్రూప్ గా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన వారిలో ముఖ్యుడు మాజీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ ఉన్నారు. లీడర్లు పోతే పోయారు.. కనీసం మిగిలిన కొద్దిమందితోనైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.. కానీ అది కూడా చేయడానికి షర్మిళ వెనుకా ముందు ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ తరుణంలో అమరావతిలో నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా షర్మిళ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం.. దాన్ని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాలతో పార్టీపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ముసలి ముతకా కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదో చిన్నపాటి ఆశ మిణుకు మిణుకుమంటూ మెరిసిందట. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని చాటుకునేలా చేసిన ఈ చిన్నపాటి ప్రయత్నమే సదురు మిగిలిన కేడరును సంతోషపెడుతోందట. మరీ ఈ తరహా కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉంటాయా..? లేక మళ్లీ అటకెక్కుతాయా..? అని అనుమానం కాంగ్రెస్ కేడర్లో కన్పిస్తోంది.